17, ఏప్రిల్ 2021, శనివారం

ప్లవ ఉగాదికి శ్రీ కడిమిళ్ల వారి అష్టావధానం

భారతీయ స్టేట్ బాంక్ వారు, శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది సందర్భంగా గురు సహస్రావధాని శ్రీ కడిమిళ్ల వరప్రసాద్ గారి అష్టావధానం విశాఖపట్నంలో ఏర్పాటుచేశారు. సమస్యా పూరణానికి పృచ్ఛకుడిగా వారికి నేనిచ్చిన సమస్య: 
నలువకు మూడు మోములని నవ్వె ఫకాలున వాణి యంతటన్!

నలువ అంటే నాల్గు మోముల వాడు (బ్రహ్మ) ఆయనకి మూడే ముఖములు అని సరస్వతి పకాలున నవ్వించిట..! అదీ సమస్య.

దానికి శ్రీ కడిమిళ్ళ వరప్రసాద్ అవధానిగారి పూరణ:

చంపకమాల.
కలదనుకొంద్రు సృష్టియను కార్యము మాత్రము బ్రహ్మయందు రూ/
కలు గొను వాడ వింతయని కంజభవుండు లిఖించుచుండు నూ/
కలు గల విన్నియే యని ముఖమ్మున వ్రాయును నాలుగెట్లగున్/
నలువకు మూడు మోములని నవ్వె ఫకాలున వాణి యంతటన్!

పై సమస్యకు నా పూరణ:

చంపకమాల.
తలఁపున దివ్య రాగములఁ దాల్చుచు శారద వీణ మీటినన్/
తొలకరి వోలెఁ జిందె సుధ; తోయజముల్ వికసింప, దిగ్భ్రమన్/
బలె! యని నాల్గు మోములొక పాటున త్రిప్పగ, వీలుకాని య/
న్నలువకు, మూడుమోములని నవ్వె పకాలున వాణియంతటన్!

తన తలపులో దివ్యమైన రాగములను తలచికొనుచు వీణను మీటగా అమృతపు జల్లు కురిసి కమలములు విచ్చుకొంటే బలే అంటూ ఆశ్చర్యంతో (ఇక్కడ కూడా సూర్యుడు వచ్చినప్పుడు కమలాలు విచ్చుకోవడం సహజం, కాని ఇక్కడ భార్య పాటకి విచ్చుకున్నాయి, అది ఆశ్చర్యానికి కారణం, పైగా అది ఆయన పుట్టిల్లు ) ఆవైపు చూడడానికి నాలుగు ముఖాలు త్రిప్పడానికి ప్రయతించగా, అలా కుదరదు కాబట్టీ నలువకు మూడే మోములు (అలా చూడడానికి పనికి వచ్చేవి అని – లోమాట) అంటూ శారద పకాలున నవ్విందని భావం..!

- రాధేశ్యామ్ రుద్రావఝల

మా అమ్మాయి, కుమారి కృష్ణప్రియ పురాణం విభాగానికి పృచ్ఛకురాలిగా వ్యవహరించి, పద్యాలు పాడింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక

O దయచేసి తెలుగు వ్యాఖ్యలు ఆంగ్ల లిపిలో కాక తెలుగులోనే వ్రాయమని మనవి. ఎందుకంటే తేట తెలుగుని తెలుగులో చదివితేనే అందం..ఆనందం.. కనుక.!!
O వ్యాఖ్యలు అజ్ఞాతముగా కాక మీ అసలు పేరో లేక కలం పేరో వినియోగించగలరు.

ప్రచలిత సమర్పణలు