అందరికీ శుభోదయం. చాలా చాలా రోజుల తరువాత వ్రాసిన పద్యమిది:
తే. గీ.
వణిజు డొకడుండె ధనికుడు పల్లె యందు,
నప్పు లిచ్చుచు బడుగుల యవసరమున
లాభ మార్జింప మిక్కిలి లోభమంది,
వడ్డి గుంజును పేదల నడ్డి విరిచి!
తీరి కూర్చుండి యరుగుపై దారి బోవు
జనుల, పేరుపేరున పిల్చి జంకు లేక
కస్సుబుస్సు లాడుచు వారి కసరు కొనుచు,
తిట్టుఁ, దిట్టిన తిట్టులన్ దిట్ట కుండ!
అదుపులేనట్టి నిష్ఠుర మతని మాట
మసకబార్చెను పరువును మంది లోన!
నింత దుర్మార్గునింజూడ, మింత కింత
యనుభవింపగ జూడమే యని తెగడిరి!
ముదిమి క్రమ్మగ రోగాల పుట్ట యగుచు
పాపములు పండి మంచము పట్టి నంత,
కలిగె జ్ఞానము, తన పాప కర్మఫలము
కొట్టె నిట్లని తలపోసి కుమిలె నతడు!
చివరి క్షణముల తనయుల చేర బిలిచి,
జీవితాంతము ప్రజలచే చెడ్డ వాడ-
నన్న యపకీర్తి కలిగెను! నన్ను మంచి-
వాడని ప్రజలు మెచ్చెడు పనిని చేయు-
డనుచు దీనుడై చాలించె తనువు నతడు!
శ్రేష్ఠి కొడుకులు తమ తండ్రి చివరికోర్కె/
దీర్పగా దృఢ సంకల్ప దీక్ష కలిగి,
బడితెలను పట్టి బాదిరి వచ్చుపోవు
జనులు గగ్గోలు పెట్టగ చచ్చునట్లు!
పరుగు లంకించి తలచిరి వణిజు గుణము:
తిట్టెనే గాని నీరీతి కొట్టలేదు!
మాట కేమి గాని మనిషి మంచి వాడు !
తనయులిద్దరి కన్ననా తండ్రి మేలు!
-- రాధేశ్యామ్ రుద్రావఝల
25.08.2026
(పాత కథకే పద్యరూపం)
😄😄😄🙏🙏🙏
